లాఠీ, రాళ్లతో దాడులు చేశారు
-స్థానికేతరులు పోలింగ్ కేంద్రాల వద్ద ఏం చేస్తున్నారు..?
-మంచిర్యాలలో రాళ్లతో దాడుల ఘటనలు ఎప్పుడైనా జరిగాయా..?
-గతంలో ఎన్నోమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాం
-బీజేపీ వారి మీద దాడులు జరిగితే పోలీసులదే బాధ్యత
-విలేకరుల సమావేశంలో బీజేపీ నేతలు
పోలీసులు ఎదురుగానే మా పై దాడులు చేశారు… కాంగ్రెస్ నాయకుడి అనుచరుడు ఒకరు కానిస్టేబుల్ వద్ద ఉన్న లాఠీ తీసుకుని మాపై దాడి చేశారు.. ఏకంగా రాళ్లు సైతం విసిరి భయానకవాతావరణం సృష్టించారు.. మంచిర్యాలలో ఎప్పుడైనా ఇలాంటి సంస్కృతి ఉందా..? అంటూ బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమ నేతలు, కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపిస్తూ డీసీపీని కలిశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పోలింగ్ బూత్ వద్ద బీజేపీ నాయకుడు కమలాకర్ రావుపై నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్ చేయిచేసుకోవడం తో ఎస్ఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేశారని అన్నారు. మంచిర్యాల ఏసీపీ, సీఐ ఉన్న సమయంలోనే వారి సమక్షంలో కాంగ్రెస్ నాయకులు, నేతలు బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీలు లాక్కొని దాడి చేయడం, రాళ్లతో దాడి చేయడం దారుణమన్నారు. దాదాపు 14 నెలలుగా దాడులకు పాల్పడుతున్న వ్యక్తి అతనే. అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాం.. ఈ వ్యక్తి మంచిర్యాల వ్యక్తే కాదు.. స్థానికేతరుడు. మరో వ్యక్తి కూడా దాడులకు పాల్పడుతున్నారు.. గతంలో ఎన్నో కేసుల్లో ఆ వ్యక్తి పేరు ఉంది. అనేక సందర్భాల్లో ఫిర్యాదులు సైతం చేశాం. ఈ దాడులు చేసే వ్యక్తులు ఎవరు అనే విషయంలో మంచిర్యాలలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని…? వారన్నారు. దాడుల సంస్కృతి ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. వాళ్ల పేర్లు ఎఫ్ఆర్ల్లో ఉన్నాయి.. బైండోవర్లలో ఉన్నాయి… పోలింగ్ స్టేషన్ పరిధిలో వారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
మంచిర్యాల చరిత్రలో రాళ్లు రువ్విన ఘటనలు ఎప్పుడు జరగలేదన్నారు. ఇంత జరిగిన తర్వాత తమ కార్యకర్తలకు ఫోన్లలో బెదిరిస్తున్నారని నువ్వు ఎక్కడ ఉన్నావ్.. ఇక్కడి రా… నిన్ను చూసుకుంటం అని బెదిరింపులకు గురి చేయడం ఏ మేరకు సమంజసం అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల మీద ఎక్కడైనా దాడులు జరిగితే దానికి పూర్తికి బాధ్యత పోలీసులదేన్నారు. బీజేపీ కార్యకర్త ఒక్కొరు మీ కార్యకర్తలు పది మందితో సమానం అని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి తదితరులు పాల్గొన్నారు.