కాపుల కలకలం.. ఏఐసీసీ సీరియస్
AICC Serious: వీహెచ్ ఇంట్లో నిర్వహించిన కాపు సంఘం నేతల సమావేశం ఇప్పుడు రాజకీయ వేడిని రగిలిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఆ సమావేశం నిప్పు రాజేసింది. ఈ వ్యవహారంపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయాల్సిన సమావేశానికి ఇతర పార్టీలను పిలవడం ఏంటని..? వారితో ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని అధిష్టానం ప్రశ్నిస్తోంది.
వీహెచ్ ఇంట్లో… పలు అంశాలపై చర్చలు..
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మున్నూరు కాపు నేతల భేటీపై ఏఐసీసీ సీరియస్ అయింది. ముఖ్యంగా కుల గణనపై ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని తప్పుబట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా హజరయ్యారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కుల గణనపై మున్నూరు కాపు నేతల సమావేశంలో చర్చించారు. మున్నూరు కాపుల జనాభాను ప్రభుత్వం తక్కువ చేసి చూపెట్టిందని నేతలు అభిప్రాయపడ్డారు. అందుకే ప్రత్యేకంగా కులం తరఫున సర్వే కమిటీ వేసుకున్నారు. కులగణనపై పలు సందేహాలు ఉన్నాయని.. ప్రతి గ్రామంలో కులగణన వివరాలు ప్రభుత్వం ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.
తమ కులానికే మంత్రి పదవి ఇవ్వాలని..
అదేవిధంగా ఈ సమావేశంలో మరో తీర్మానం సైతం చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు.. మున్నూరు కాపుల ప్రాతినిధ్యం లేకుండా ఏ మంత్రివర్గం లేదని.. ఖచ్చితంగా మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్నూరు కాపుల ఆధ్వర్యంలో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని, పార్టీలకు అతీతంగా సంఘటితంగా ముందుకెళ్లాలని ఈ భేటీలో నిర్ణయించారు. మున్నూరు కాపు నేతల సమావేశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఓ రకంగా ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారనే చర్చ సాగుతోంది.
ఈ సమావేశంపై ఏఐసీసీ సీరియస్..
ఈ సమావేశంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి.. ప్రతిపక్ష పార్టీలను పిలవడమేంటని మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు బీసీ కులగణనపై ప్రభుత్వాన్ని విమర్శించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సామాజికవర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలనే విషయంలో సైతం మంత్రివర్గ ఏర్పాటు అనేది అంతర్గత విషయమని.. ఇలాంటి అంశాలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. అటు తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పైనా మున్నూరు కాపు నేతల సమావేశంలో చర్చ జరగడంపైనా ఏఐసీసీ సీరియస్ అయింది. దీనిపై మీనాక్షి నటరాజన్ వివరాలు సేకరించారు.