వణికిస్తున్న వానరాలు…

చెట్లు విరుగుతున్నయ్… గూనపెంకులు పగులుతున్నయ్… అడ్డుగా పోత మీద కొన్ని దాడులు చేస్తున్నాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇల్లు గుల్లచేస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోని పలు పల్లెల్లో నిత్యం కోతుల దాడులతో పల్లెజనం భీతిల్లుతున్నారు. వానర సైన్యాన్ని కట్టడి చేయడం తెలియక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కోతులు సృష్టిస్తున్న కిష్కిందకాండపై ప్రత్యేక కథనం…
కోతులతో నిత్యం కిష్కింధకాండనే..
ఈ కోతుల సమస్య జిల్లా వ్యాప్తంగా ఉంది. సూర్యోదయం కాకముందే ఇళ్లపై దాడిచేస్తున్న కోతులను వెల్లగొట్టేం దుకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి పక్కన పెంచుకున్న కూరగాయల చెట్లను పీకేస్తున్నాయి.. మామిడికాయలు, జామకాయలు కొరికి వేస్తున్నాయి.. పెంకుటిళ్లు పైన గూన పెంకులు తొలగిస్తున్నాయి. పెంకుటిళ్లలో నివసించే వారు రానున్న వర్షాకాలంలో తమ ఇళ్లు ఉంటాయా..? వర్షాలకు కూలుతాయా…? అనేంతగా భయపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
బయటకు రావాలంటేనే భయం..
తాండూరు మండలంలో మాదారం టౌన్షిప్తో పాటు పలు గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బయటకు వెళ్లాలంటేనే జనం బెంబేలెత్తుతున్నారు. కోతుల దాడిలో పలువురు గాయపడుతున్నారు కూడా. సూర్యోదయానికి ముందే ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ.. హఠాత్తుగా పది నుంచి ఇరవై వరకు కోతుల మంద ఇళ్లపై దాడి చేస్తున్నాయి. గూనపెంకులు పగులగొడుతూ.. ఇళ్లలోకి దూరి నిత్యావసర సరుకులను ఎత్తుకెళ్తున్నాయి. అంతేకాకుండా ఇంటిని సైతం చిందరవందర చేస్తున్నాయి. కోతులను వెల్లగొట్టేందుకే నానా తంటాలు పడాల్సి వస్తోంది. కోతులకు అటవీ ప్రాంతంలో ఆహారం దొరక్క పోవడంతో గ్రామాలపై దాడులు చేస్తున్నాయి.
పట్టించుకోని నేతలు, అధికారులు…
ప్రజల ఇబ్బందులు ఇలాగే కొనసాగుతున్నా అటు అధికారులు కానీ, ఇటు నేతలు కానీ పట్టించుకోకపోవడం పట్ల పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోతుల నివారణ చర్యలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి తమకు ఎలంటి ఆదేశాలు లేవని అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. ఇక నేతలు సైతం ఈ విషయంలో ముందుకు రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ముందుకు వస్తే తాము ఖర్చుల కోసం ఎంతోకొంత ఇస్తామని కోతుల బెడద భరించలేమంటూ ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు ముందుండి ఈ కోతుల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు.