తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టు

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ(Marubeni Company) తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు.
దాదాపు రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి, నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. అందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. దీంతో దాదాపు రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడును ఆకర్షించే అంచనాలున్నాయి.
అనంతరం ప్రఖ్యాత మల్టీనేషన్ వ్యాపార దిగ్గజం సోనీ కార్పోరేషన్ (Sony Group Corporation) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ (Crunchyroll) బృందాన్ని కలిసింది. సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ప్రదర్శించిన కంపెనీ ప్రతినిధులు, ఆయా ఉత్పత్తులతో పాటు వారి పని తీరు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం వివరణాత్మక చర్చలు జరిపింది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ , గేమింగ్ రంగాలలో పెట్టుబడుల విస్తరణకు హైదరాబాద్లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది.