ప్రజావాణి ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారంపై ప్ర‌త్యేక చ‌ర్య‌లు

Prajavani: ప్రజావాణి దరఖాస్తులను అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం క‌లెక్ట‌ర్‌లో ఆయ‌న అర్జీదారుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించారు. భీమారం మండల కేంద్రానికి సందనవేని అజయ్ మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడాలని దరఖాస్తు అందించారు. హాజీపూర్ మండలం ముల్కల్లకు చెందిన కునరపు చంద్రమొగిలి గ్రామ శివారులో ఉన్న త‌న భూమి అక్రమంగా ఆక్రమించారని, తనకు న్యాయం చేయాలని కోరారు. బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్లోని షట్టర్ల లబ్దిదారులు తాము వ్యాపారం చేసుకునే స్థలాన్ని అప్పగించినప్పుడు తమకు షట్టర్లు ఇస్తామని హామీ ఇచ్చారని, వ్యాపారం చేసుకునే వరుసలో రూములు ఇప్పించాలని కోరారు.

హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన ఎగ్గె ప్రవీణ్ గ్రామ శివారులో తమకు చెందిన భూమిని బంధువులు తమకు తెలియకుండా విక్రయించారని, ఈ లావాదేవీని రద్దు చేసి న్యాయం చేయాలన్నారు. నస్పూర్ మండల కేంద్రానికి చెందిన చిందం లలిత మీ-సేవ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల చెరువు ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్లను నిర్ణయించి చెరువు కబ్జా కాకుండా కాపాడాలని సి.పి.ఐ.(ఎం) న్యూడెమొక్రసీ ప్రతినిధులు కోరారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన రామగిరి అరుణ ఎన్నో ఏండ్లుగా కిరాయి ఇంట్లో నివసిస్తున్నానని, తన భర్త మరణించారని, నిరుపేద అయిన తనకు ఇల్లు మంజూరు చేయాల‌ని కోరారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామ‌న్నారు. కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్‌తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like