ఆ ఇద్ద‌రూ ఎవ‌రు..?

Operation Sindhur: పహల్గాంలో ఉగ్రవాద దాడికి ప్ర‌తీకారంగా భార‌త్ “ఆపరేషన్ సింధూర్” చేపట్టి ఉగ్ర‌వాద శిబిరాలు ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది వ‌ర‌కు చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై భార‌త్ మీడియా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సమావేశంలో భారత సైన్యంలో ఉన్నత స్థాయి మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషీ (ఇండియన్ ఆర్మీ), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (ఎయిర్ ఫోర్స్) కలిసి మాట్లాడారు. దీంతో కల్నల్ సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ ఎవ‌రంటూ జోరుగా చ‌ర్చ సాగుతోంది. వీరిద్ద‌రి గురించి అంద‌రూ ఇంట‌ర్ నెట్‌లో వెతుకుతున్నార‌ట‌…

కల్నల్ సోఫియా ఖురేషీ…. భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్ విభాగానికి చెందిన వారు. సోఫియా గుజరాతీ. జీవరసాయన శాస్త్రంలో పీజీ చదివారు. సోఫియా భర్త మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ విభాగంలో అధికారిగా ఉండగా.. ఆమె తాత కూడా సైన్యంలో పనిచేశారు. 2016లో నిర్వహించిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక గ్రూపులో భారత బలగాలకు నాయకత్వం వహించారు. అందులో పాల్గొన్న 18 దేశాల బృందాల్లో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు. సోఫియా ఖురేషీ ఐక్యరాజ్యసమితి శాంతి బలగాల్లో ఆరు సంవత్సరాలు సేవలు అందించారు. ముఖ్యంగా 2006లో కాంగోలో జరిగిన మిషన్‌లో ఆమె చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. విలేక‌రుల స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ యుద్ధ భూముల్లో కాల్పుల విరమణను పర్యవేక్షించడం, అక్కడ ఉన్న ప్రజలకు సహాయం చేయడం గర్వంగా ఉందన్నారు. ఇక ఆమె గురించి సదర్న్ కమాండ్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. ఆమె ఎంపిక కేవలం సామర్థ్యం, నాయకత్వం వల్లే జరిగిందని మెచ్చుకున్నారు.

మరోవైపు మీడియా సమావేశంలో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడానికి వాయుసేన ఎలా సహకరించిందో వివరించారు. ముఖ్యంగా ఏరియల్ సపోర్ట్, సర్వెయిలెన్స్, టార్గెట్ కోఆర్డినేషన్ వంటి అంశాలపై స్పష్టంగా వివరించారు. దీంతో ఇద్దరు మహిళా అధికారులు కీలక ఆపరేషన్ లో పాల్గొనడం పట్ల భారత సైన్యంలో మహిళల పాత్ర ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది. ఆడ, మగ లాంటి లింగ ప్రాధాన్యతకు కాకుండా సామర్థ్యానికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని భారత సైన్యం మరోసారి నిరూపించిందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like