సింగరేణిలో వినూత్న పవర్ ప్లాంట్
- నిర్మాణానికి సంస్థ శ్రీకారం
- 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్
- డీపీఆర్ తయారీకి వ్యాప్కోస్ కి అప్పగింత
- సింగరేణి సీఎండీ బలరామ్ వెల్లడి
- తెలంగాణలోనే మొట్టమొదటి ప్లాంట్

Singareni:సింగరేణి సంస్థ వినూత్న పవర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ తరహా ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిది కావడం గమనార్హం. వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పిన సింగరేణి మరో వినూత్న విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ ఏర్పాటుకు రంగంలోకి దిగింది. రామగుండం-1 ఏరియాలో మూతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని వాటర్ సంపు ఆధారంగా పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక అధ్యయనాలు పూర్తిచేసిన కంపెనీ సంపూర్ణ ప్రాజెక్టు రిపోర్ట్ రూపొందించడానికి వ్యాప్కోస్ సంస్థకు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు లెటర్ ఆఫ్ అవార్డు అందజేసినట్లు సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. ఈ తరహా ప్రాజెక్టు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరూ చేపట్టలేదు. ప్లాంటు ఏర్పాటు చేయనున్న మేడిపల్లి ఓపెన్ కాస్ట్ సంపు, నిర్మాణ ప్రాంతాన్ని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క పరిశీలించారు. ఈ వినూత్న ప్రాజెక్టు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుకూలంగా స్పందించడంతో సంస్థ ముందగుడు వేసింది.
ప్రాజెక్టు వివరాలు ఇవే…
వ్యాప్ కోస్ సంస్థ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ సంపు ఆధారంగా 500 మెగావాట్ల పంపు స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మించడానికి సంబంధించిన పూర్తి అధ్యయనం జరుపుతుంది. జియోలాజికల్, జియోటెక్నికల్, హైడ్రాలజీ అధ్యయనాలతో పాటు సివిల్ డిజైన్లు, ఉత్పత్తి సామర్థ్య అంశాలు మెకానికల్, ఎలక్ట్రికల్ డిజైన్లు, పర్యావరణ సంబంధ అంశాలు, రక్షణ చర్యలు వంటి విషయాలపై సమగ్ర అధ్యయనాన్ని జరిపి డిపిఆర్ రూపొందించాల్సి ఉంటుంది. ప్లాంట్ నిర్మాణానికి పట్టే సమయం, నిర్మాణపు ఖర్చు, ప్లాంట్ పూర్తయిన తర్వాత ఉత్పత్తి అయ్యే విద్యుత్తు అమ్మకాల అవకాశాలు డీపీఆర్ లో పొందుపరచనున్నారు. ఈ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఒక రకంగా చెప్పాలంటే జల విద్యుత్తు ప్రాజెక్టు తరహాలో పనిచేస్తుంది. జల విద్యుత్తు కేంద్రాలలో నీటి ప్రవాహ ఉధృతికి టర్బైన్లు తిరగటం వల్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అయితే అక్కడ సహజ సిద్ధమైన జలపాతాల నీటిని ఇందుకోసం వినియోగిస్తారు.
పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు..
పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు ఎత్తయిన ప్రదేశానికి తోడిన నీటిని కిందికి వదలడం ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో సుమారు 157 మీటర్ల లోతున భారీ నీటి సంపు ఏర్పడి ఏడాది పొడుగునా భారీ పరిమాణంలో నీరు నిలవ ఉంటుంది. ఈ నీటిని ఉపరితలంపై నిర్మించనున్న దాదాపు ఇదే పరిమాణం గల మరో భారీ నీటి రిజర్వాయర్ లోకి పగటిపూట సోలార్ విద్యుత్ ద్వారా పంపింగ్ జరుపుతారు. పగటిపూట నింపిన నీటిని భారీ పైపుల గుండా రాత్రివేళ కిందికి పంపిస్తూ ఆ జలశక్తితో, మధ్యలో ఏర్పాటు చేసిన టర్బైన్లను తిప్పడం వలన విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కింద ఉన్న నీటిని పైకి పంపిణీ చేసి, అక్కడ నిలువ చేసిన నీటిని కిందికి పంపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు కనుక దీనినీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు అని పిలుస్తారు. మూతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో ఉన్న భారీ నీటి సంపు, ఉపరితలంలో రిజర్వాయర్ నిర్మించడానికి ఖాళీ ప్రదేశ లభ్యతలు ఇక్కడ ఉండటం వల్ల సింగరేణి మొత్తంలో ఈ ప్రాజెక్టును ఇక్కడే ఏర్పాటు చేయాలని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
భారీ రిజర్వాయర్ డామ్ ఏర్పాటు
ఉపరితలంపై నీటినిల్వ కోసం సుమారు 2,350 మీటర్ల పొడవు తో 23 మీటర్ల లోతు రిజర్వాయర్ డామ్ నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్లో 9.64 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉన్న నీటిని నిలువ చేసి దీనిలో నుండి పంపింగ్ కోసం 8 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని వినియోగిస్తారు. ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 3000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. 40 ఏళ్ల పాటు 500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ పంప్డ్ స్టోరేజీ ప్లాంటు సింగరేణికి గట్టి ఆర్థిక పరిపుష్టి కలిగిస్తుంది. వ్యాప్కోస్ లిమిటెడ్ సంస్థ డిపిఆర్ సిద్ధం చేయగానే నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచే అవకాశం ఉంది.
కార్యక్రమంలో సీఎండీ ఎన్.బలరామ్, డైరెక్టర్ ఈఅండ్ఎం సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్డిఎం సుభాని, జనరల్ మేనేజర్ సిపిపి మనోహర్, జనరల్ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స సుబ్బారావు పాల్గొన్నారు.