ఆలస్యం చేస్తే చర్యలు తప్పవు..

సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ హెచ్చరిక

Singareni:సింగరేణి చేపట్టిన సోలార్ ప్లాంట్ల నిర్మాణాలు గడువు లోగా పూర్తి చేయాలని, పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఏజెన్సీల కాంట్రాక్టులు రద్దు చేస్తామని, బ్లాక్ లిస్టులో పెడతామని సింగరేణి సీఎండీ బలరామ్ హెచ్చరించారు. గురువారం సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి దశలో పూర్తి చేయాల్సి ఉన్న 54.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం, రెండవ దశలో పూర్తి చేయాల్సి ఉన్న 67.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియపై ఆరా తీశారు. ఈ నిర్మాణాలను గడువు లోపు పూర్తి చేయకుండా, తీవ్ర జాప్యం చేస్తున్న నిర్మాణ ఏజెన్సీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బిల్లుల చెల్లింపుల విషయంలో సింగరేణి నుంచి ఎటువంటి జాప్యం లేకన్నా నిర్మాణ సంస్థలు తమ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా పనులను అక్టోబర్ నాటికి వేగంగా పూర్తి చేయాలని కోరారు.

ఇకపై ఎటువంటి పొడిగింపులు ఉండవని స్పష్టం చేశారు. నిర్మాణ ఏజెన్సీలకు ఇదే చివరి అవకాశం అన్నారు. నిర్మాణాలు అక్టోబర్ కల్లా పూర్తి చేయకపోతే ఆ ఏజెన్సీకి ఇచ్చిన కాంట్రాక్టు రద్దు చేస్థామన్నారు. పనుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహించిన వారి కంపెనీలో బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. పనులు పూర్తి చేయడానికి సింగరేణి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. సోలార్ ప్లాంట్ల ప‌నుల‌ను నిర్ణీత వ్య‌వ‌ధిలో పూర్తి చేయించ‌క‌పోతే సంబంధిత అధికారుల ప‌నితీరును వారి స‌ర్వీస్ రికార్డుల‌తో న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. మందమర్రిలో 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం (బి.ఇ.ఎస్.ఎస్) వ్యవస్థ పనులను కూడా ఆగస్టు లోపు పూర్తి చేయాలన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ సూర్య ఘర్ యోజన పథకం కింద సింగరేణిలో వివిధ భవనాలపై చేపట్టిన 32.75 మెగావాట్ల రూఫ్ టాప్ ప్లాంట్ల నిర్మాణపు పనులన్నీ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

సమావేశంలో డైరెక్టర్ ఈఅండ్ఎండి సత్యనారాయణరావు, ఈడీ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం సుభాని, జనరల్ మేనేజర్ (సోలార్) సీతారామం, జనరల్ మేనేజర్(వర్క్షాప్) ఫ్రిజరాల్డ్, పీపీడీ(హెచ్‌వోడీ) విశ్వ‌నాథ‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like