ప్రభుత్వం కూలడం ఖాయం
MLA Raj Gopal Reddy:సొంత పార్టీ, ప్రభుత్వంపైనే విమర్శలు ఎక్కుపెట్టే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యల చేశారు. యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు. నేపాల్ తరహాలో యువత తిరగబడితే ప్రభుత్వం కూలడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని గన్ పార్క్లో సెప్టెంబర్ 17 సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిరుద్యోగులతో కలిసి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేకపోయిందన్నారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి.. కేవలం 50 వేల నియామకాలు చేపట్టిందన్నారు. నిరుద్యోగులకు ఓ అన్నలాగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు.
నిరుద్యోగులను గాలికి వదిలేకూడదని వాళ్ల మన పిల్లలు అని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగులు అధైర్య పడకండని.. నిరసనలు ధర్నాలు మానుకోవాలని సూచించారు. నిరుద్యోగుల సమస్యలు వినడానికి అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తాకి, సెంట్రల్ లైబ్రరీకి దిల్సుఖ్నగర్కు తానే వస్తానని హామీ ఇచ్చారు. వారికి దారిచూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. తెలంగాణ యువత కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపించడానికి పోషించిన పాత్ర అమోఘమైందన్నారు. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యమయ్యే పని కాదు అయినా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు చదువుకున్న యువత తమ కాళ్ళ మీద నిలబడేలా ఉపాధి మార్గాలు చూపిస్తామన్నారు.
గత ఎన్నికల ముందు బీజేపీలో ఉన్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆయనకు అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డితో పాటు పార్టీ పెద్దలు కూడా ఓపెన్ గానే అనేక సార్లు వెల్లడించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. విస్తరణలోనూ ఆయనకు మంత్రి పదవి రాలేదు. దీంతో ప్రభుత్వంపై ఆయన విమర్శల దాడి పెంచారు.