అంగన్వాడీ కేంద్రంలో చోరీ
తాండూరు మండలం మాదారం టౌన్ షిప్ లో ఓ అంగన్వాడీ కేంద్రంలో దొంగలు పడ్డారు. శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. దొంగలు అంగన్వాడీ కేంద్రం తలుపుల తాళం విరగ్గొట్టి లోపల ఉన్న బియ్యం, వంట నూనె ప్యాకెట్లు, కందిపప్పు, పిల్లలకు ఇచ్చే బాలామృతం ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న ఖాళీ క్వార్టర్ లో మందు తాగి ఆ సీసాలను అలాగే వదిలేసిన దొంగలు రాత్రి దొంగతనం చేశారు. ఘటనను బట్టి చూస్తే స్థానికంగా ఉన్న వారే ఈ దొంగతనానికి పాల్పడ్డారని అనుమానాల వ్యక్తం అవుతున్నాయి.
గతంలోను మాదారం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న చేనుల్లో రైతుల సోలార్ బ్యాటరీలు, వైరులు ఎత్తుకుపోయారు. ఇలా చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్నారని వదిలేస్తే మరిన్ని పెద్దవి జరిగే అవకాశం ఉందని పలువురు గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.