పేరు గొప్ప… ఊరు దిబ్బగా జాతీయ కార్మిక సంఘాలు
Singareni:సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల పరిస్థితి పేరు గొప్ప… ఊరు దిబ్బగా మారిందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి(TBGKS State President Miryala Rajireddy) దుయ్యబట్టారు. ఆదివారం శ్రీరాంపూర్ ఏరియాలోని RkNT మైన్ లో TBGKS యూనియన్ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులపై ప్రేమతో సింగరేణిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షతన అవన్నీ సాధించామన్నారు. వారి ఫలాలు ఇప్పుడు కార్మికులు అనుభవిస్తున్నారని స్పష్టం చేశారు.
గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలైన AITUC, INTUC తాము జాతీయ సంఘాలు అని చెప్పుకోవడం తప్ప కార్మికులకు ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినా ఇప్పటి వరకు ఒకటి కూడా సాధించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నా దానిపై కనీసం నోరు మెదపడం లేదన్నారు. సింగరేణి ప్రైవేటుపరం వైపు పెద్ద ఎత్తున అడుగులు వేస్తున్నా, రాజకీయ జోక్యం విపరీతంగా పెరుగుతున్నా ఈ రెండు సంఘాలకు కొంచెం కూడా పట్టింపు లేదన్నారు. రానున్న రోజుల్లో TBGKS యూనియన్ను సింగరేణి వ్యాప్తంగా గెలిపించుకొని సింగరేణిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను కాపాడుకోవాలన్నా, మరిన్ని కొత్త హక్కులను సాధించుకోవాలన్నా TBGKS యూనియన్కు అండగా ఉండాలని మిర్యాల రాజిరెడ్డి కోరారు.
టీబీజీకేఎస్లో చేరికలు..
ఈ సందర్భంగా పలువురు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో చేరారు. మైనింగ్ స్టాఫ్ నుండి ఓవర్ మెన్లు రవికుమార్, గడ్డం రవీందర్, మైనింగ్ సర్దార్ సత్యనారాయణతో పలువురు కార్మికులు టీబీజీకేఎస్లో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, సెంట్రల్ ట్రెజరర్ సతీష్ సెంట్రల్ జాయింట్ సెక్రెటరీ సత్తయ్య, సెంట్రల్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొగాకు రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్వేష్ రెడ్డి, MD లాల మహ్మద్, బ్రాంచ్ సెక్రటరీ వెంగల కుమారస్వామి, బ్రాంచ్ నాయకులు దేవేందర్, రాజు, శ్రీకాంత్ పిట్ సెక్రటరీ జైపాల్ రెడ్డి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ రాజేంద్రప్రసాద్ షిఫ్ట్ సెక్రటరీలు భగవాన్, రాజ్ కుమార్, కుమార స్వామి, శంకర్ మై నాయకులు రాజు మున్షి, తలారి రవికుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు..