పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు
BRS Gives Show Cause Notice To Rohith Reddy:బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై ఈ నోటీసులు పంపించింది. వారం గడువు విధిస్తూ ఆలోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. గడువు సమయంలోపు వివరణ ఇవ్వకున్నా… ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకున్నా క్షమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ వ్యవహారం పార్టీ పటిష్టత, విశ్వసనీయతకు భంగం కలుగుతుందని తెలిపింది. తుది నిర్ణయం తీసుకునే వరకు పైలెట్ రోహిత్రెడ్డిని పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని వెల్లడించింది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్లో శనివారం రాత్రి జరిగిన పార్టీ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎటువంటి అనుమతి లేకుండా జరుగుతున్న ఈ పార్టీపై శనివారం రాత్రి 9:30 గంటలకు పోలీసులు దాడి చేశారు. ఘటనా స్థలంలోడ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో ఉన్న ఐదుగురికి నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ అని తేలింది. పోలీసులు లోపలికి ప్రవేశించగానే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఆ గన్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డిది కాగా, లైసెన్స్ ఉన్నప్పటికీ మరొకరు కాల్పులు జరపడం తీవ్ర ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు. ఈ పార్టీలో మొత్తం 10 మంది (9 మంది పురుషులు, ఒక మహిళ) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.