బాలింత మృతి.. ఆసుపత్రి సిబ్బందిపై ఆరోపణలు
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ బాలింత ఆసుపత్రి ఆవరణలోనే ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె వార్డు నుంచి బయటకు వెళ్లిన సమయంలో సిబ్బంది పట్టించుకోలేదని, తమకు సీసీ ఫుటేజీ చూపించమన్నా చూపించలేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నల్గొండ జిల్లా మునుగోడు మండలం చికటి మామిడి గ్రామానికి చెందిన మమత అనే బాలింత ఆసుపత్రి ప్రాంగణంలోని నీటి ట్యాంకుకు ఉరివేసుకుని మృతి చెందింది. తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. మమత వార్డు నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అంతేకాదు.. ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాలని కోరినా సిబ్బంది స్పందించలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. సకాలంలో స్పందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
బాలింత మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.