అయ్యో కాక… గిట్లాయే ఏంది..?
కాకా వెంకటస్వామి…. నీ పేరు వింటే చాలు, పేదోళ్ల పెన్నిధిగా గుర్తుకొస్తవు… నిన్ను కాక వెంకటస్వామి కంటే కూడా గుడిసెల వెంకటస్వామి గానే నిన్ను గుర్తుంచుకుంటం… 80 వేల మందికి కులం, తలం అని లేకుండా ఆశ్రయం కల్పించిన నిన్ను ఎలా మరిచిపోతం.. కార్మికులకు అండగా నిలబడి పార్లమెంట్లో మా గురించి మాట్లాడిన నిన్ను గుండెల్లో పెంటుకున్నం కదా…? నువ్వు ఎంత మందికి రాజకీయ ఆశ్రయం కల్పించావు… నీ చేత ఎంత మందికి టిక్కెట్లు ఇప్పించావు… ఎమ్మెల్యేలు, ఎంపీలు నీ చుట్టూ తిరిగేవారు.
నీ ప్రస్థానం అంత గొప్పది మరి… ఇందిరాగాంధీ సమకాలీకుడివి… ఖర్గే కూడా నీ గురించి గొప్పగా చెప్పుకుంటారే.. చివరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా నీ చలవే కదా… ఇంతటి ఘనకీర్తి ఉన్న నీకు ఇలాంటి దారుణం అంటే చాలా బాధ కలుగుతోంది. నువ్వు చనిపోయిన తర్వాత నీ విగ్రహం కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతోంది. సోనియా, ఖర్గే, రాహుల్, ముఖ్యమంత్రి ఇలా ఎందరితోనో విగ్రహావిష్కరణలు చేయించుకోవాల్సిన పరిస్థితి…
కానీ, కాక ఇక్కడ అంతా రివర్స్ అవుతోంది. మంచిర్యాలలో నీ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు కేవలం రాజకీయ స్వార్థం కోసం నీ విగ్రహాన్ని దొంగతనంగా ఆవిష్కరించారు. అది కూడా నీ కొడుకులో… నీ కుటుంబ సభ్యులో కాదు.. కేవలం రాజకీయం కోసం, తమ పట్టు నిలుపుకోవడం కోసం నీ విగ్రహాన్ని ఎవరికీ చెప్పకుండా ఒక రకంగా చెప్పాలంటే దొంగతనంగా ఆవిష్కరించడంతో మా మనసు విలవిలాడింది.
నీ కొడుకు వివేక్ మంత్రి, మరో కొడుకు ఎమ్మెల్యే, మనవడు ఎంపీ… ఇలా ఇంత మంది ఇలాంటి దారుణం అంటే చాలా బాధ కలుగుతోంది. అసలు ఈ విగ్రహావిష్కరణ ఇలా ఎవరికీ చెప్పకుండా ప్రారంభించడానికి కారణమే వీరు అని సైతం కొందరు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా అంగరంగ వైభవంగా జరగాల్సిన నీ విగ్రహావిష్కరణ అలా జరగడం, అది కూడా రాజకీయం కోసం చేయడం మమ్మల్ని కుంగదీస్తోంది…
బాధాతప్త హృదయాలతో…
నీ అభిమానులం…