మహిళా కండక్టర్లకు శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థను ప్రజలకు చేరువ చేసేందుకు వినూత్న నిర్ణయాలతో మన్ననలు పొందుతున్న ఆయన.. తాజాగా మహిళా కండక్టర్లకు శుభవార్త చెప్పారు. ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా కండక్టర్లకు ఇకపై రాత్రి 8 గంటల వరకే డ్యూటీలు వేయాలని, రాత్రి 8 గంటల్లోపే వారు డిపోలకు చేరుకునేలా డ్యూటీ ఛార్ట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
గ్రేటర్ హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు ఈ ఆదేశాలను పాటించాలని సజ్జనార్ సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి 8 గంటలు దాటిన తరువాత డ్యూటీ చేయాల్సి వస్తే ఆ కారణాన్ని హెడ్ ఆఫీస్కు తెలియజేయాలని సూచించారు. సజ్జనార్ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా కండక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు వినూత్న నిర్ణయాలు, కార్యక్రమాలతో సజ్జనార్ ఇప్పటికే ప్రసంశలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.