మెడికల్‌ కాలేజీకి రూ.500 కోట్లు

రామగుండం ప్రాంతంలో ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రాంత ప్రజల దీర్ఘ కాలిక కోరిక నెరవేరే శుభ తరుణం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రామగుండంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సింగరేణి సంస్థ 500 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సంస్థ సీ అండ్ఎండీ శ్రీధర్‌ ప్రత్యేక చొరవతో ఈ నెల 10వ తేదీన జరిగిన బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో 500 కోట్ల రూపాయల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. దీనికి సోమవారం కొత్తగూడెంలో జరిగిన చారిత్రాత్మక సింగరేణి 100వ వార్షిక సర్వ సభ్య సమావేశం తన అంగీకారం తెలిపింది. దీంతో రామగుండం ఏరియాలో మెడికల్‌ కాలేజీ, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు ఖరారైంది.

వైద్య కళాశాలతో పాటు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి

రామగుండం ప్రాంతంలో ఒక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయనున్నామని, తద్వారా ఈ ప్రాంత ప్రజలకు, కార్మికులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రెండేళ్ల క్రితం శ్రీరాంపూర్‌ ఏరియాలో జరిగిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించారు. కాగా, ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో సింగరేణి సంస్థ ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి 500 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సంస్థ సీ అండ్ ఎండీ ఎన్‌.శ్రీధర్‌ దీనిపై ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నెల 10వ తేదీన బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఉంచగా, దీనికి బోర్డు తన ఆమోదం తెలిపింది.

సోమవారం జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో కూడా ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. సింగరేణి నిధులతో ఏర్పాటు చేసే ఈ వైద్య కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో హైదరబాద్‌ వంటి పట్టణాల్లో లభించే అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య విభాగాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు కూడా అందజేయనున్నారు. దీనివల్ల సింగరేణి కార్మికులు, రిటైర్‌ అయిన కార్మికులు, వారి కుటుంబీకులకే కాకుండా పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాల ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

రెండేళ్ల లో నిర్మాణం పూర్తి…

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ కోట్లాది రూపాయల సీఎస్‌ఆర్‌ నిధులు, డీఎంఎఫ్‌టీ నిధులతో ఇప్పటికే తెలంగాణ ప్రాంత అభివృద్ధికి చేయూతనిస్తుండగా.. ఈ సారి ఈ ప్రాంత ప్రజల వైద్య అవసరాలకు, వైద్య విద్యలకు ప్రోత్సామం అందిస్తూ 500 కోట్ల రూపాయలను మెడికల్‌ కాలేజీ, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కు కేటాయించడం తన 133 సంవత్సరాల చరిత్రలో ఇదే ప్రథమం. ఈ కళాశాల వైద్య శాలను రెండేళ్ల లో పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనితో తెలంగాణ ప్రాంతంలో ఒక మంచి సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల ఏర్పాటు చేయాలని, అలాగే వెనకబడిన ఈ ప్రాంత విద్యార్థులకు ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అందుబాటులో ఉండాలన్న కార్మికుల, స్థానికుల చిరకాల కోరిక మరో రెండేళ్ల లో సాకారం కానుంది.

ర ముఖ్యమంత్రికి సింగరేణి తరఫున సీ అండ్ ఎండీ కృతజ్ఞతలు…

రామగుండం ప్రాంతంలో వైద్య కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు నిర్ణయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కు సింగరేణి కార్మికులు, ఉద్యోగుల తరఫున సంస్థ ఛైర్మన్‌ మరియు ఎండీ శ్రీ ఎన్‌.శ్రీధర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సింగరేణి ఉద్యోగులు ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య కళాశాల, వైద్య శాల ఏర్పాటు చేయాలంటూ కోరుతున్నారని, దశాబ్దాల నాటి కలను సాకారం చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇటువంటి సమాజ హిత కార్యక్రమాల్లో సింగరేణి సంస్థ పాలుపంచుకునే అవకాశం లభించడం పట్ల తన సంతోషం వ్యక్తం చేశారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like