భక్తులను అతిథుల్లా చూడాలి

మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్

మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రానియొద్దని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతర పనులను ముమ్మరం చేయాలన్నారు. ప్రణాళిక బద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. పెండింగ్ పనులపై దృష్టి పెట్టాలని కోరారు. గ‌తంలో కంటే మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గతంలో వచ్చిన ఇబ్బందులను బేరీజు వేసుకుని, వాటిని ఈసారి అధిగమించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి, పారిశుద్ధ్యం, వసతి, ఇతర సొకర్యాలపై దృష్టి సారించాలన్నారు. సామాన్య భక్తుల క్యూ లైన్లు, భారీకెడ్లు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. స్నాన ఘ‌ట్టాల వ‌ద్ద త‌గిన ఏర్పాట్లు చేయాలన్నారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్త‌కుండా పోలీసులు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకొవాలని, పోలీసు ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలని ఆదేశించారు. మన ఇంటికి వచ్చే అతిథులను ఎలాగో చుస్తామో… జాతరకు వచ్చే భక్తులకు అలాంటి ఏర్పాట్లు చేయాలన్నారు. జనవరి 15 లోగా పనులు పూర్తి అయ్యేలా ఆధికారులు పని చేయాలన్నారు. మేడారం జాతర ఏర్పాట్లను అటవీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప‌రిశీలించారు. జంపన్న వాగు వ‌ద్ద నిర్మించిన‌ స్నానఘట్టాలను, షేడ్లను, ఇత‌ర ప‌నుల‌ను పరిశీలించారు.అంతకుముందు సమ్మక్క, సారలమ్మను మంత్రులు దర్శించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే సీతక్క, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిదులు, అధికారులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like