సింగరేణిలో టీఆర్ఎస్ అక్రమాలు
-అవి కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై తప్పుడు ప్రచారం
-బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్

మంచిర్యాల : సింగరేణి సంస్థలో టిఆర్ఎస్ చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ దుయ్యబట్టారు. ఆదివారం మంచిర్యాల బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు సంవత్సరాల నుంచి సింగరేణిలో 73,000 మంది కార్మికులను 42,000కు తగ్గించారని అన్నారు. టీబీజీకేఎస్ సింగరేణి లో ఎన్నో అక్రమాలు చేస్తోందన్నారు. ఈ అన్యాయాలు, అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీ మీద నెపం నెట్టి కార్మికులను మోసం చేస్తున్నారన్నారు. టిఆర్ఎస్, టీబీజీకేఎస్ చేస్తున్న ప్రయత్నాలు కార్మికులు గమనిస్తున్నారని అన్నారు. కమర్షియల్ మైనింగ్ చట్టం 2015లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లుకు మద్దతుగా అప్పుడు ఎంపీగా ఉన్న టీబీజీకేఎస్ గౌరవధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్ మద్దతు పలికారని స్పష్టం చేశారు. బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ చట్టం పైన ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరినా ఇప్పటి వరకు చెప్పలేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చే ముందు ఓపెన్ కాస్ట్కు వ్యతిరేకం అని చెప్పారని అన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టిఆర్ఎస్ 2014 నుంచి ఇప్పటి వరకు ఆరు ఓపెన్ కాస్ట్ ప్రారంభించిందన్నారు. ఈ ఓపెన్ కాస్టుల్లో సైతం చాలా మంది కార్మికులను కాంట్రాక్ట్ బేసిక్ లోనే తీసుకుంటున్నారని అన్నారు. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లో టీఆర్ఎస్ టీబీజీకేఎస్ ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పిందన్నారు. ఇవన్నీ కార్మికులకు తెలియకూడదని, కార్మికులను మోసం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పై తప్పుడు నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం టీబీజీకేఎస్ ప్రయత్నం చేస్తుంది. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ మండల అధ్యక్షులు కౌన్సిలర్ రాజు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ,బిజెపి నాయకులు సతీష్ రావు, మల్యాల శ్రీనివాస్, రజనీష్, పట్టి కృష్ణ, రంగ శ్రీశైలం, మల్లేష్, ప్రభాకర్ రావు, రమేష్, అశోక్, సాయి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.