కార్మిక వ్యతిరేక చర్యలను కలిసి తిప్పికొడదాం

మంచిర్యాల : కేంద్రం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను కలిసి తిప్పికొడదామని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ఏరియా అబ్బాపూర్ గని వద్ద మంగళవారం నిర్వహించిన గేట్ మీటింగ్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పొట్టకొట్టడానికి సిద్ధమైందని దుయ్యబట్టారు. ఈ కార్మిక వ్యతిరేక చర్యలను కార్మికులంతా కలసి ఏకమై ఉద్యమించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి సింగరేణి ప్రైవేటీకరణను ఆపాలన్నారు. ఈ ఉద్యమంలో సింగరేణి కార్మికులు, ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులమైన తాము కూడా భాగస్వామ్యం అవుతామన్నారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలో జరిగే నిరాహార దీక్షకు సింగరేణి కార్మికులు, ఉద్యోగులు అందరూ హాజరై విజయవంతం చేసి మన ఐక్యతను ఢిల్లీ వరకు చాటిచెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మాల్రాజు శ్రీనివాసరావు, సింగరేణి చర్చల కమిటీ ప్రతినిధి ధరావత్ మంగిలాల్, మెరుగు రమేష్, అన్నం లక్ష్మయ్య, రాజేశం, గురిజాల రమేశ్ పాల్గొన్నారు.