విషాదాంతం…

36 గంటల పాటు ఎదురుచూపులు.. ఆ బొగ్గు పెళ్లల కింద అయినా తమ వాళ్లు బతికి ఉంటారనే ఆశ.. తోటి వాళ్లను ఎలాగైనా రక్షించాలనే రెస్క్యూ టీం పట్టుదల.. అందరి ఆశలు అడియాసలే అయ్యాయి. పెద్ద ఎత్తున బొగ్గు పెళ్లలు పడటంతో అడ్రియాల గని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
రామగుండం ఏరియా త్రీ లాంగ్వాల్ ప్రాజెక్టులో జరిగిన గని ప్రమాదంలో సహాయక సిబ్బంది మూడు మృతదేహాలను బయటకు తీశారు. దాదాపు 36 గంటలు కష్టపడినా వారిని కాపాడలేకపోయారు. చనిపోయిన వారిలో ఏరియా సేఫ్టీ అధికారి జయరాజ్, మరొకరు డిప్యూటీ మేనేజర్ చైతన్య తేజ, కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ గుర్తించారు. మృతదేహాలను గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ముగ్గురుని కాపాడి తాను చిక్కుకొని…
బొగ్గు బండ కూలుతుందని గ్రహించిన ఏరియా సేఫ్టీ అధికారి జయరాజ్ అక్కడే ఉన్న ముగ్గురు కార్మికులను కాపాడి తాను మాత్రం మృత్యుఒడిలోకి జారుకున్నారు. సింగరేణి చరిత్రలో ఏరియా సేఫ్టీ అధికారి మరణించడం పోవడం ఇదే మొదటిసారి.దాదాపు 36 గంటల పాటు నిరంతరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ప్రమాద స్థలాన్ని అర్ధరాత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత సింగరేణి డైరెక్టర్లు బలరాం చంద్రశేఖర్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డ మరో ముగ్గుర కార్మికులలో బదిలీ వర్కర్ రవిందర్ కు మెరుగైన వైద్యం హైదరాబాదు తరలించగా, మిగతా ముగ్గురు కార్మికులు గోదావరిఖని ఏరియా అసుపత్రిలొ చికిత్స పొందుతున్నారు.