ఆసుపత్రులకు నిధులు మంజూరు చేయండి

మంచిర్యాల : చెన్నూరు పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ దవాఖానకు అదనపు నిధులు అందించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని కోరారు. శనివారం అసెంబ్లీలో మంత్రి చాంబర్లో ఆసుపత్రులకు సంబంధించి నిధులు అందించాలని బాల్క కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరులో రూ.7 కోట్లతో ప్రభుత్వ దవాఖాన నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.గతంలో ఉన్న దానిని ప్రజా అవసరాల దృష్ట్యా 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఆసుపత్రిలో అదనపు గదుల నిర్మాణానికి రూ. 14.50 కోట్లు, మౌలిక సదుపాయాలు, యంత్ర సామాగ్రికి రూ. 2. 50 కోట్లు అవసరం అవుతాయని వెల్లడించారు. మొత్తం రూ. 17 కోట్లతో పాటు వైద్య సిబ్బందిని సైతం అదనంగా నియమించాలని కోరారు. జైపూర్ మండలం కుందారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. విప్ బాల్క సుమన్ చేసిన విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.