తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
-తెలంగాణలో వెయ్యి కోట్లు పెట్టుబడిగా పెట్టనున్న ఫిష్ ఇన్
-ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే కంపెనీ
-సుమారు 5000 మందికి ఉపాధి అవకాశాలు

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఎన్నో కంపెనీలను ఆకర్షిస్తున్నారు. ఆయన అక్కడ ఆయా కంపెనీల ప్రతినిధులు, సీఈవోలతో సమావేశం అవుతూ ఇక్కడ ఉన్న అనుకూలతలు వివరిస్తున్నారు. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయి. తాజాగా, తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతోంది.. తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ఫిష్ ఇన్ కంపెనీ సిద్ధమైంది.. ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే కంపెనీగా పేరునున్న ఫిష్ ఇన్… రాష్ట్రంలో అడుగుపెట్టబోతోంది.. ఈ కంపెనీ పెట్టుబడితో సుమారు 5000 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఫిష్ ఇన్ కంపెనీ ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ. తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ఆ కంపెనీ ముందుకు వచ్చింది. అమెరికాలో మంత్రి కేటీఆర్తో జరిగిన సమావేశంలో ఆ కంపెనీ ఛైర్మన్, సీఈవో మనీష్ కుమార్.. ఈ మేరకు కంపెనీ నిర్ణయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టంని డెవలప్ చేసేందుకు కంపెనీ నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద ఈ మేరకు కంపెనీ తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. కంపెనీ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సుమారు 85 వేల మెట్రిక్ టన్నుల చేపలను ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని సమాచారం.