సింగరేణి ప్రైవేటీకరణ చేస్తోందని తప్పుడు ప్రచారం
-బీజేపీ నేతల దృష్టికి తీసుకువచ్చిన కేంద్ర మంత్రి
-బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన నేతలు
మంచిర్యాల : సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. సింగరేణి సమస్యలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని బీజేపీ నేతలు కలిశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అదిలాబాద్ ఎంపీ సొయం బాపు, మంచిర్యాల బిజెపి జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ , నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అగల్ డ్యూటీ రాజు తదితరులు కలిసి మాట్లాడారు. ఈ వివరాలను వెరబెల్లి రఘునాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కోల్ ఇండియా అయినా సింగరేణి అయినా దేశంలో కొత్త కోల్ బ్లాక్స్ ఇచ్చే విధానం ఒకటే అని అన్నారు. అలోకేషన్ పద్ధతిలో 14 శాతం రాయితీ కట్టడం కంటే వేలం పాటలో పాల్గొని సింగరేణి కేవలం 4-4.5 శాతానికి ఈ కోల్ బ్లాక్స్ పొంది సింగరేణి లాభాలు ఇంకా పెంచుకోవచ్చని అన్నారు. ఒరిస్సాలో వేలం లో పాల్గొన్న సింగరేణి సంస్థ తెలంగాణ లో ఎందుకు పాల్గొనడం లేదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. సింగరేణి లో జరుగుతున్న అవినీతిని పై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి గారిని తాము కోరినట్లు రఘునాథ్రావు స్పష్టం చేశారు.