బ్రదర్ అనిల్ నుంచి మా చర్చిలను కాపాడండి..

బ్ర‌ద‌ర్ అనిల్ నుంచి త‌మ చ‌ర్చిల‌ను కాపాడాల‌ని క్రిస్టియన్ సంఘాలు కోరుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బావ, క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్‌పై బ్రదర్ అనిల్ తనకు సంబంధం లేని సంస్థల్లో తలదూర్చుతున్నారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చ్ సంస్థ ప్రతినిధులు మండిపడ్డారు. పోలీసు కేసులో ముద్దాయిగా ఉన్న లాజరస్ అబ్రహం అనే వ్యక్తిని బ్రదర్ అనిల్ తీసుకువచ్చి ట్రెజరర్ గా నియమించారంటూ ఆ సంస్థ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు తెనాలి ఐతానగర్‌లోని ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చిలో మత పెద్దలు సమావేశమయ్యారు.

ఈ మేర‌కు చ‌ర్చిలో సంఘం ప్రతినిధులు సోమ‌వారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో బ్రద‌ర్ అనిల్ కుమార్‌కు అనుకూలంగా కొంద‌రు, వ్యతిరేకంగా మ‌రికొందరు గ‌ళం విప్పారు. ఫ‌లితంగా స‌మావేశంలో ర‌భ‌స చోటుచేసుకుంది. రెండు గ్రూపులుగా విడిపోయిన సంఘం ప్రతినిధులు ప‌రస్పరం దూషించుకున్నారు.

అనంతరం క్రైస్తవ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. 2021 నుంచి బ్రదర్ అనిల్ తమ సంస్థల్లో ఇన్వాల్వ్ అవుతూ, మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తులకు బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. మొత్తం 43 కేసుల్లో 5 మర్డర్, ల్యాండ్ సెటిల్ మెంట్ కేసులు కలిగిన లుంజాల లాజరస్ అబ్రహం అనే వ్యక్తికి తమ సంస్థలో బాధ్యతలు అప్పగించిన ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ సంస్థకు సంబంధించిన ఆస్తులను కబ్జా చేయడానికి బ్రదర్ అనిల్ యత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినా.. ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు.

150 ఏళ్ల చరిత్రగల సంస్థ గత 10 నెలల నుంచి విపత్కర సమస్యలు ఎదుర్కొంటోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. తమ సంఘంలో అసాంఘిక శక్తులు చొరబడి సమస్యలను ఛిన్నాభిన్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా ఎన్నికైన వారిని కూడా పక్కకునెట్టి బ్రదర్ అనిల్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటనలను అరికట్టాలంటే నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి, రాబోయే రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు మత పెద్దలు వెల్లడించారు.

ఆనవాయితీగా వస్తున్న నిబంధనల ప్రకారం మే నెలలో ఎన్నిక జరిగితే మళ్ళీ వచ్చే ఏడాది మే నెల వరకు అతనే అధ్యక్షుడిగా కొనసాగుతారని.. కానీ, బ్రదర్ అనిల్ జోక్యంతో ఫిబ్రవరిలోనే ఎన్నికలు పెట్టినట్లు ప్రతినిధులు చెప్పారు. ప్రజా ఎన్నిక కాకుండా తమ సొంత ఎన్నిక చేసుకొని తమ సంఘంలోనికి అరాచక శక్తులు చొరబడ్డారు. పోలీసులు, ప్రభుత్వం తమ సంస్థ నిబంధనల గౌరవించి మళ్లీ అదే సంస్థ పెద్దలను అధికారంలో కూర్చోబెడతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. క్రైస్తవులంటే సీఎం జగన్‌కు ఎందుకంత చులకన భావమని ప్రశ్నించారు.

You might also like