సాయి పల్లవిపై పోలీసులకు ఫిర్యాదు

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ సినీనటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఆమెపై హైదరాబాద్ సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఈ ఫిర్యాదు చేశారు.విరాటపర్వం ప్రమోషన్స్లో భాగంగా.. సాయి పల్లవి ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదమయ్యాయి. కశ్మీర్లో కశ్మీరీ పండిట్ల హత్యకు, జై శ్రీరామ్ అనలేదనో లేక గోరక్ష పేరుతోనో చేసే హింసకు తేడా లేదని ఆమె వ్యాఖ్యానించింది. రెండూ ఒకటే అని ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో.. ఆమె మాటలు వివాదానికి దారి తీశాయి. ఆమెపై భజరంగ్దళ్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సాయి పల్లవిపై వారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ‘హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలను భజరంగ్దళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆమెకు డబ్బు వ్యామోహం తప్ప దేశ పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేదు. దేశ చరిత్ర గురించి.. ఉగ్రవాదుల గురించి తెలుసుకుని మాట్లాడితే బాగుండేది..’ అంటూ భజరంగ్దళ్ నేతలు అన్నారు. సాయి పల్లవితో పాటు డైరెక్టర్ వేణుపై కూడా వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు.