నిలిచిన 108… ఆగిన ప్రాణం
అపర సంజీవినిగా పేరున్న 108 అంబులెన్స్ మార్గమధ్యంలో మొరాయించింది. దీంతో మహిళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
కొత్తగూడెం జిల్లా చర్లలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. చర్ల మండలం రాళ్లపురం గ్రామానికి చెందిన మడావి చుకిడీ (25) కుటుంబ సమస్యల కారణంగా బుధవారం అర్ధరాత్రి ఎలుకల మందు తాగింది. కుటుంబ సభ్యులు గురువారం ఉదయం గమనించి 108కు ఫోన్ చేశారు. దీంతో 108 అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. బాధిత మహిళను తీసుకొని ఆ అంబులెన్స్ ఆసుపత్రికి బయల్దేరింది. అటవీ మార్గంలో ఓ చోట ఆగిపోయింది.
సిబ్బంది, మహిళ బంధువులు కిందికి దిగి తోసినా అంబులెన్స్ స్టార్ట్ కాలేదు. సుమారు అర్ధగంట సేపు ప్రయత్నించిన తర్వాత బాధిత మహిళ చుకిడీని బైక్పై కూర్చోబెట్టుకొని చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు.