18 గేట్లు దించేశారు..
-పూర్తయిన కడెం ప్రాజెక్టు మరమ్మతు పనులు
-యుద్ధప్రాతిపదికన పనులు చేసిన ఇంజనీరింగ్ సిబ్బంది
-ఆనందం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు

కడెం ప్రాజెక్టు మరమ్మతు పనులు పూర్తయ్యాయి. మొత్తానికి ఇంజనీరింగ్ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడి 18 గేట్లు దించేశారు. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు అన్నింటి మరమ్మతులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. కొద్దిరోజుల కిందట కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా కడెం ప్రాజెక్టు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు గేట్లకు అధికారులు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టారు. హైదరాబాద్కు చెందిన ప్రత్యేక బృందం ప్రాజెక్టు వద్దే తిష్ఠ వేసి గేట్లకు, కౌంటర్వేటర్ల మరమ్మతులు చేశారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 18 గేట్లు వరద ప్రవాహానికి దెబ్బతిన్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు గేట్లు కిందికి దిగకపోవడంతో వరదసమయంలో ముప్పు వెంటాడింది. ఓ దశలో వరదప్రవాహం ఉధృతికారణంగా ప్రాజెక్టు కొట్టుకుపోవచ్చని సంకేతాలు వెలువడ్డాయి. దీంతో అధికారులు వరద ప్రవాహం ధాటి నుంచి ప్రాజెక్టును రక్షించే విషయంలో చేతులేత్తేశారు. మొత్తంగేట్లు కిందికి దిగని కారణంగా ఇప్పటి వరకు 40 టీఎంసీలకు పైగా వరద నీరు గోదావరి పాలైంది.
హైదరాబాద్కు చెందిన 15 మందితో కూడిన టెక్నికల్ బృందం పనులు చకచకా పూర్తి చేసింది. ప్రాజెక్టు రెండు, మూడో గేటుకు సంబంధించి కౌంటర్వేటర్లు వరద ఉధృతికి పూర్తిగా దెబ్బతినగా, వరదనీటిలో మునిగి తొమ్మిది జర్మన్ గేట్లకు, ఏడు ఇండియన్ గేట్లకు కూడా నష్టం వాటిల్లింది. వాటన్నికి మరమ్మతు చేసిన అధికారులు శుక్రవారం చివరిదైన 18 గేటు కూడా దించేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.