ఘనంగా రథసప్తమి వేడుకలు

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నార.. ఈ వేడుకల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకేరోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, నీరు పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఈ రోజు 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు కల్ప వృక్ష వాహనం, సాయంత్రం ఆరు నుంచి 7 గంటల వరకు సర్వ భూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. చివరగా చంద్రప్రభ వాహనంతో సేవలు ముగుస్తాయి.