గొంతుకోసి… బండరాయితో కొట్టి
-మంచిర్యాల జిల్లా ఇందారంలో దారుణ హత్య
-వివాహితపై వేధింపులే కారణం
-అందరూ చూస్తుండగానే హత్య
-వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
-విచారణ చేపట్టిన పోలీసులు

Murder: ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా, అసభ్య పదజాలంతో మెసేజ్లు పెడుతున్న ఓ యువకున్ని యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు హతమార్చారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
ముస్కె మహేష్(28) అనే యువకుడు బండిలో పెట్రోల్ పోయించుకుని వస్తున్న క్రమంలో ఓ కుటుంబం అతన్ని అడ్డగించింది. ఇద్దరు అతన్ని గట్టిగా పట్టుకోగా, మరో ఇద్దరు మేకలు కోసే కత్తులతో గొంతు కోసి బండరాయితో మోది చంపేశారు. అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగినా ఎవరూ కూడా ఆపేందుకు ముందుకు రాలేదు. పైగా దీనిని వీడియో తీసి సోషల్మీడియాలో పోస్టు చేశారు. ఇందారంలో మహేష్కు మరో యువతికి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఆమెకు మరో వ్యక్తితో పెళ్లైంది. ఆ యువతి భర్త సంవత్సరం కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
దీంతో ఆమె తల్లిగారింటి వద్దే ఉంటోంది. మహేష్ ఫోన్ ద్వారా అసభ్య పదజాలంతో మెసేజ్లు పంపిస్తుండటంతో ఆ కుటుంబం మహేష్ను హెచ్చరించింది. పోలీస్ స్టేషన్లో పలుమార్లు కేసు పెట్టినా, మహేష్ వేధింపులు ఆపలేదు. దీంతో ఆ కుటుంబం మంగళవారం ఉదయం మాటువేసి మహేష్ ను రాళ్లతో కొట్టి చంపేసింది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మహేష్ను చంపిన వారిని తమకు అప్పగించాలని మహేష్ బంధువులు ఆందోళనకు దిగారు.