మహాత్మాగాంధీ మనువడు కన్నుమూత

Arun Manilal Gandhi:మహాత్మాగాంధీ మనవడు, రచయిత అరుణ్ మణిలాల్ గాంధీ మరణించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ వెల్లడించారు. మహారాష్ట్ర కొల్హాపూర్ సమీపంలోని హన్బర్వాడిలో ఉన్న అవని సంస్థలో బస చేస్తున్న అరుణ్ గాంధీ 24 సంవత్సరాలుగా అనురాధ భోసలే నిర్వహిస్తున్న అవని సంస్థకు వస్తుండేవారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కొల్హాపూర్కు వచ్చిన అరుణ్గాంధీ అక్కడ పదిరోజులు బస చేయాలని అనుకున్నారు.
అక్కడి నుంచి బయలుదేరే ముందు అరుణ్ గాంధీ అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రయాణాలు చేయవద్దని వైద్యులు సూచించడంతో అక్కడ ఉండిపోయారు. 89 ఏళ్ల అరుణ్ గాంధీ ఏప్రిల్ 14, 1934న డర్బన్లో మహాత్మాగాంధీ కొడుకైన మణిలాల్ గాంధీ, సుశీలా మష్రువాలా దంపతులకు జన్మించారు. రచయితగా, సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. అరుణ్ గాంధీ కార్యకర్తగా తన తాత అడుగుజాడల్లో నడిచారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ కొల్హాపూర్లో జరగనున్నాయి.