మీరు కేసీఆర్ను వదిలి బయటకు రండి..
ఉద్యమకారులకు పిలుపునిచ్చిన ఈటెల రాజేందర్ కేసీఆర్ నియంతృత్వ, అవినీతి పాలనపై పోరాటం
హైదరాబాద్ – తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ ను వదిలి బయటకు రావాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు గన్పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్నా చౌక్ అవసరం ఏంటో కేసీఆర్ కు తెలిసొచ్చిందని, ధర్నా చౌక్ వద్దన్న వాళ్ళే ధర్నా చౌక్ లో ఆందోళన చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్ళుగా వరి ధాన్యం కొన్నది ఎవరో కేసీఆర్ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బీజేపీ నాయకత్వంలో కేసీఆర్ నితంతృత్వ, అవినీతి పాలనపై పోరాటం చేస్తానని చెప్పారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎగిరేది కాషాయ జెండా మాత్రమేనని స్పష్టం చేశారు. మిల్లింగ్ టెక్నాలజీని పెంచుకోవటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. కేసీఆర్ గంటకొద్దీ విలేకరుల సమావేశం పెడుతుంటే చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ పెద్ద నోరుతో చెప్తోన్న అబద్దాలు నిజాలు అయిపోవన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని దుయ్యబట్టారు. ప్రజల మీద ప్రేముంటే కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.