కబ్జా పాలిటిక్స్
-ఎమ్మెల్యే భూ బకాసురుడు అంటూ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి ధ్వజం
-దాదాపు 400 కోట్ల విలువైన భూమిని మింగేశాడంటూ ఆరోపణలు
-సర్వే నంబర్లతో సహా వెల్లడించిన కంది శ్రీనివాస రెడ్డి
-మీడియాకు ఆధారాలు చూపించిన కేఎస్ఆర్
-ఆయనే డొల్ల కంపెనీలు పెట్టి మోసం చేశాడని కందిపై పాయల్ ధ్వజం
-న్యాయంగా ఆస్తులు సంపాదించడం తప్పేనా? అంటూ ఎదురు ప్రశ్నలు
-దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరిన ఎమ్మెల్యే శంకర్
-చివరకు ఏం తేలుతుందోనని ఆసక్తిగా చూస్తున్న ప్రజలు
ఆయన కబ్జాకోరు.. అక్రమంగా భూములు సంపాదించారు.. దాదాపు నాలుగు వందల కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడ్డాడు.. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించాడు. ఆయన దోచుకున్న భూములు వెనక్కి తీసుకుంటే 35 వేల మంది పేదలకు ఇండ్ల జాగాలు పంచవచ్చు
– కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీ కంది శ్రీనివాస్రెడ్డి
————————————————————————————————————-
ఆయనే డొల్ల కంపెనీలు పెట్టి మోసం చేశాడు.. భూ కబ్జాలకు పాల్పడ్డాడు.. అలాంటి నైజం నాది కాదు.. నాపై ఆరోపణలు కాదు… నిజం నిరూపించాలి.. న్యాయంగా ఆస్తులు సంపాదించుకోవడం తప్పా…? చివరకు మహాయజ్ఞాన్ని కూడా రాజకీయాలకు వాడుతున్నారు.. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని, మంత్రులను కలుస్తుంటే విష ప్రచారం చేస్తున్నారు
-ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రస్తుతం రాజకీయం వాడిగా, వేడిగా సాగుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎమ్మెల్యే కబ్జా కోరంటూ కంది వ్యాఖ్యానిస్తుండగా, అసలు కబ్జాలు చేసేదే ఆయన అంటూ ఎమ్మెల్యే దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా ఇద్దరూ ఒకరిపై ఒకరు మాటల బాణాలు విసురుకుంటూ ఆదిలాబాద్ రాజకీయాన్ని వేడేకిస్తున్నారు. శుక్రవారం కంది శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే, తెల్లవారే ఎమ్మెల్యే తిరిగి విలేకరుల సమావేశం నిర్వహించి భూ కబ్జా ఆరోపణలు ఖండిచమే కాకుండా, అసలు కబ్జాదారు కంది శ్రీనివాసేనని, డొల్ల కంపెనీలు పెట్టి తాను మోసాలకు పాల్పడలేదని పరోక్షంగా ఆయనపై ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే రూ. 400 కోట్లు మింగారు…
ఎమ్మెల్యే పాయల్ పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ కంది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. దాదాపు 400 కోట్ల విలువైన భూమిని మింగేసిన శంకర్, కబ్జాల్లో నెంబర్ వన్ అంటూ దుయ్యబట్టారు. తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున భూదందా చేసిన వారిలో మన ఎమ్మెల్యే ఫస్ట్ అన్నారు. ప్రభుత్వ భూమినే అల్లుడి పేర కబ్జా చేసి పార్టీ ఆఫీస్ కోసం అదే పార్టీకి అమ్మిన చరిత్ర పాయల్ శంకర్ దని ఎద్దేవా చేసారు. ఎన్నికల సమయంలోను తప్పుడు అఫిడవిట్ సమర్పించారని దుయ్యబట్టారు. కొంత మంది భాగస్వాములు అనుచరులతో కలిసి ఆదిలాబాద్ లో భూ మాఫియా నడిపిస్తున్నాడని ఆరోపించారు. ల్యాండ్ సెటిల్ మెంట్లు చేయడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య అన్నారు. ఎమ్మెల్యే భూ బాగోతాన్ని, సంబంధించిన రుజువులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీజేపీ అధిష్టానికి కూడా పంపిస్తామన్నారు. ఆయన దోచుకున్న భూములను వెనక్కి తీసుకుంటే 35 వేల మంది పేదలకి ఇంటి సమస్య తీర్చవచ్చని దుయ్యబట్టారు.
ఆరోపణలు తప్ప… ఆధారాలు లేవు..
ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం దీనికి ధీటుగా స్పందించారు. అవి కేవలం ఆరోపణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేవంటూ కొట్టిపారేశారు. అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు హయాంలో ఎన్వోసీ ఇచ్చిన భూమినే తన అల్లుడు కొనుగోలు చేశాడని ఇందులో కబ్జా ఎక్కడ ఉందన్నారు. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేసే నైజం తనది కాదని, న్యాయంగా ఆస్తులు సంపాదించడం తప్పేనా? అని ప్రశ్నిం చారు. చివరకు డైట్ మైదానంలో జరిగిన మహాయజ్ఞం నిర్వహణ విషయంలోనూ విమర్శలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని పాయల్ శంకర్ దుయ్యబట్టారు. కంది శ్రీనివాస్ రెడ్డి తన ప్రజా భవన్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న నీటి పారుదలశాఖ స్థలం కబ్జా చేశారని పాత, కొత్త ఫొటోలను మీడియాకు ఎమ్మెల్యే చూపించారు. మీడియా ప్రతినిధులతో కలిసి ప్రభుత్వ స్థలాలను పరిశీలిస్తే ఉద్దేశ పూర్వకంగా తాను కబ్జ్బాలను యత్నిస్తున్నానని వ్యక్తిగత ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను కలుస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నానని, ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. అధికారంలో ఉంది మీ ప్రభుత్వమేగా విచారణ జరిపించు అని కంది శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు.
ఇలా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా రాజకీయం కాస్తా హాట్హాట్గా మారింది. మరి నిజంగానే ఒకరిపై ఒకరు చేసిన ఆరోపణలు నిరూపిస్తారా…? లేక కొద్ది రోజుల తర్వాత మర్చిపోతారా..? ప్రజలకు వారిద్దరు ఫైనల్గా ఏం చేప్తారనేది వేచి చూడాలి మరి..