అగ్ని ప్రమాదాలతో అలర్ట్.. ఎల‌క్ట్రిక్ బ‌స్సుల నిలిపివేత‌

వరుస అగ్నిప్రమాదాలు టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC)ని అప్రమత్తం చేశాయి. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ జేబీఎం (JBM) కంపెనీకి చెందిన దాదాపు 500 ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. కరీంనగర్ డిపోకు చెందిన రెండు ఈ-బస్సులు వేర్వేరు ఘటనల్లో అగ్నికి ఆహుతి కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ఈ-బస్సుల స్థానంలో డీజిల్ బస్సులను నడుపుతోంది. సమగ్ర సాంకేతిక, భద్రతా తనిఖీలు పూర్తయ్యాకే ఎలక్ట్రిక్ బస్సులను తిరిగి రోడ్లపైకి తీసుకురానుంది.

కరీంనగర్ డిపోకు చెందిన రెండు జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు ఇటీవల వేర్వేరు ఘటనల్లో అగ్నిప్రమాదానికి గురికావడంతో టీజీఎస్‌ఆర్టీసీ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాల్లో నడుస్తున్న సుమారు 500 జేబీఎం ఈ-బస్సుల సర్వీసులను ఈ రోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభావిత మార్గాల్లో వెంటనే డీజిల్ బస్సులను ప్రత్యామ్నాయంగా నడుపుతోంది. అన్ని ఎలక్ట్రిక్ బస్సులకు సమగ్ర సాంకేతిక, భద్రతా తనిఖీలు పూర్తైన తర్వాతే వాటిని తిరిగి సేవల్లోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో పర్యావరణహిత రవాణాను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకం కింద ఒలెక్ట్రా సంస్థ నుంచి మరో 1,085 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు టెండర్లు, ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు భద్రతా ప్రమాణాలపై దృష్టి పెట్టడంతో పాటు, మరోవైపు ఈ-మొబిలిటీ విస్తరణకు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్రభుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like