టీఆర్ఎస్ నేతల అరెస్టులు..
TRS:రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్టులు చేస్తున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భగాయిత్ భూపోరాటానికి పిలుపునిచ్చారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భూపోరాటం కొనసాగనుంది. భూపోరాటానికి వెళ్తారనే సమాచారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు చేశారు. ఉదయం 9 గంటలకు ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో భూపోరాటం చేసే ప్రాంతానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత చేరుకుంటారు.
మంచిర్యాల జిల్లాలో తెలంగాణ రక్షణ సేన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. TRS మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జ్ ఐద ప్రశాంత్, చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్ మేడి రాజశేఖర్, సంపత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఉదయం 4 గంటలకే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడుతున్న TRS నాయకుల అక్రమ అరెస్టు దారుణమన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యమకారులను అణచివేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఎన్ని అరెస్ట్ లు చేసినా.. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.