గరియాబంద్లో భారీ ఎన్కౌంటర్, ఇద్దరు సెంట్రల్ కమిటీ సభ్యుల మృతి
Encounter: ఛత్తీస్ గఢ్ – ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మొత్తం 14 మంది వరకు మావోయిస్టులు భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. వీరిలో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు సైతం ఉన్నట్లు భావిస్తున్నారు. సోమవారం సాయంత్రం గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో ఛత్తీస్గఢ్, ఒడిశా భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గరియాబంద్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇరుపక్షాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఆపరేషన్లో గరియాబంద్ డీఆర్జీ, ఒడిశా ఎస్వోజీ దళాలు, 207 కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ సిబ్బంది సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గుడ్డుతోపాటు మావోయిస్టు ముఖ్య నేతలు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
ఒడిశాలోని నువాపాడ జిల్లా సరిహద్దు నుంచి 5 కి.మీ దూరంలో ఉన్న ఛత్తీస్గఢ్లోని కులరిఘాట్ రిజర్వ్ ఫారెస్ట్లో జనవరి 19 రాత్రి నుంచి భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టుల గురించి సమాచారం అందడంతో ఆదివారం రాత్రి ఒడిశాలోని నువాపాడ జిల్లా, ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లా సరిహద్దులో ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు- CRPF సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ ప్రారంభించారు. సోమవారం జరిగిన ఎందురుకాల్పులలో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. అదే సమయంలో భద్రతా దళాలు పెద్ద అక్కడ పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, 1 SLR, IED స్వాధీనం చేసుకున్నాయి. ఈ అంతర్ రాష్ట్ర ఆపరేషన్ కొనసాగింపులో భాగంగా జనవరి 21 తెల్లవారుజామున SOG బృందం, ఇతర బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. కాల్పులు జరిపిన చోట భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
2024లో ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్ లో 6 మంది మావోయిస్టులు మరణించారు. మరో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. మరో 24 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. 2025లో ఇప్పటివరకు ఛత్తీస్గఢ్ పోలీసులు, CAPFతో కలిసి చేసిన ఆపరేషన్లలో మొత్తం 14 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గరియాబాద్ ఎన్కౌంటర్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట తరాలపల్లి కి చెందిన మోడం బాలకృష్ణ @ బాలన్న @ భాస్కర్, @ మనోజ్ SZC కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు సమాచారం అయితే అధికారిక ధ్రువీకరణ జరగలేదు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతి కూడా చనిపోయినట్లుగా సమాచారం. ప్రస్తుతానికి చలపతి ఆంధ్ర ఒడిస్సా సెక్రటరీగా కొనసాగుతున్నాడు.