సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం
High Court:తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై హైకోర్టు (High Court) లో దాఖలైన పిటిషన్లపై ఈ రోజు కోర్టు విచారణ చేసింది. రిజర్వేషన్ల పరిమితిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన ధర్మాసనం, ఈ దశలో జీవోపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నవంబర్ 22న జీవో నెం.46ను విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు మొత్తం 50 శాతం కంటే ఎక్కువ కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టు (High Court) లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టుల జోక్యం ఉండదని ఈసీ తరఫున లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో చీఫ్ జస్టిస్ ఏకీభవించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్కార్ విడుదల చేసిన జీవో నెం.46పై ఈ దశలో స్టే ఇవ్వలేమని స్పష్టం చేశారు.