సీపీఎం ఆధ్వర్యం రాస్తారోకో
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 2005 చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో మరో చట్టం తీసుకురావడం దారుణమని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ CPM పార్టీ తాండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా CPM పార్టీ తాండూరు మండల కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం మార్చడం అంటే గ్రామీణ భారతాన్ని ఆకలితో చంపే కుట్రగా అనిపిస్తున్నదని దుయ్యబట్టారు. గ్రామీణ ఉపాధి పని దినాలకు ఉపాధి చట్టం ద్వారా కొంతమేరకైనా పని దొరికిందన్నారు.
కోవిడ్ సమయంలో పట్నం నుండి తిరిగి గ్రామాలకు వస్తే ఉపాధి కోట్లాది మందిని కొంతైనా ఆదుకుందని వెల్లడించారు. కొత్త చట్టంలో సంవత్సరానికి 100 రోజుల పని 125 రోజులకు పెంచడం, వ్యవసాయ సీజన్లో రైతులకు కూలీలు అందుబాటులో ఉండటానికి 60 రోజులు పాటు ఉపాధి పనిని నిషేధించారని తెలిపారు. ఉపాధి ఖర్చులో కేంద్రం ఇస్తున్న 90 శాతం వాటా 60 శాతానికి తగ్గించారని, రాష్ట్రాల వాటా 10 శాతం నుండి 40 శాతానికి పెంచడం ఏమిటని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. రోజుకు 600 రూపాయల వేతనం చెల్లించాలని, గతంలో ఉన్న చట్టాలన్నిటిని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో వేల్పుల శంకర్, బొల్లం రాజేశం, పెరుగు, ఒండ్రీ రేవా, దుర్గం లీల, దుర్గం కవిత, కోట కుసుమ, లలిత పాల్గొన్నారు.