మ‌రో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దం..

Bus Accident :ఇటీవలి కాలంలో వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. కొవ్వూరు ఫ్లైఓవర్ ఫై బుధవారం తెల్లవారుజామున RRR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలను అదుపుచేసే ప్రయత్నం చేసేలోపే బస్సు మొత్తం మంటలు వ్యాపించి పూర్తిగా దగ్దమైంది. ఈ సంఘటనతో ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బస్సు దగ్దం ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఖమ్మం నుంచి విశాఖపట్టణం వైపు ప్రయాణిస్తోంది. బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్ పైకి చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేశారు. అందులో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది బస్సు నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా బస్సు పూర్తిగా దగ్దమైంది.

బస్సు ప్రమాదం ఘటనతో ప్రయాణికులను వేరే బస్సుల్లో తరలించారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బస్సులో మంటలు చెలరేగి అనేక మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. అయితే, ప్రస్తుతం సంక్రాంతి పండుగ వస్తుంది. పట్టణాల్లో నివాసం ఉండే ప్రజలు ఎక్కువగా సొంతగ్రామాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడం.. బస్సు పూర్తిగా దగ్దమైన ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like