తప్పుడు రాతలతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర
ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: తప్పుడు రాతలతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. “మా ప్రభుత్వాన్ని బద్నాం చేయొద్దు. ఎర్రవెల్లి ఫాంహౌస్లో ఉండి కొందరు పన్నాగాలు పన్నుతున్నారు. నా మంత్రులపై వార్తలు రాసే ముందు నా వివరణ తీసుకోండి. సింగరేణి టెండర్ విషయంలో అవినీతికి ఆస్కారం లేదన్నారు. సింగరేణి టెండర్ల విషయంలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంద”ని తెలిపారు.
తమ మంత్రుల ప్రతిష్ఠ దెబ్బతీసేలా కథనాలు ప్రచురించవద్దని స్పష్టంగా హెచ్చరించారు. మీడియా సంస్థల మధ్య విభేదాలుంటే వారు పరస్పరం తేల్చుకోవాలని, కానీ ప్రభుత్వ మంత్రుల జోలికి మాత్రం రావొద్దని తేల్చిచెప్పారు. ఏదైనా వార్త రాసేముందు తన వద్ద నుంచి వివరణ తీసుకోవాలని సూచించారు. తప్పుడు కథనాలు వెలువడితే అది తన గౌరవాన్ని కూడా దెబ్బతీసినట్టేనని సీఎం పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పట్లో రేషన్ కార్డు పొందాలంటే ఎవరో ఒకరు చనిపోవాల్సిన పరిస్థితి ఉండేదని సీఎం వ్యాఖ్యానించారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసిందని తెలిపారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2కే కిలో బియ్యం పథకాన్ని గుర్తు చేస్తూ, తమ ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం అందిస్తోందన్నారు. అలాగే వైఎస్ఆర్ స్ఫూర్తితో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. పేదలకు 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించినట్లు వెల్లడించారు.