మనవడితో కలిసి నిలువెత్తు బంగారం ఇచ్చిన సీఎం
CM Revanth Reddy:మేడారం(Medaram) సమ్మక్క- సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈరోజు పునఃప్రారంభించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు ఆదివాసీలు గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్ళతో స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క- సారలమ్మలకు సారె సమర్పించారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి తన మనవడు రేయాన్ష్తో కలిసి తులాభారం వేసుకుని సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ మేడారం జాతరకు ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. హైదరాబాద్ నుంచి మేడారానికి రూ.600 నుంచి రూ.1,110 వరకు టికెట్ చార్జీలను ఖరారు చేసింది. వరంగల్ నుంచి రూ.250 నుంచి రూ.500 వరకు చార్జీలు నిర్ణయించారు. అలాగే భూపాలపల్లి, ఖమ్మం, గోదావరిఖని, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని ఆర్టీసీ స్పష్టం చేసింది.