ప్రేమ పేరుతో మోసం.. ఎస్ఐకి పదేండ్ల జైలు శిక్ష
యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో ఓ ఎస్ఐకి కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. గుంటూరు జిల్లా కోర్టు తీర్పు చెప్పిన ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి… నగరపాలెం ఎస్ఐగా పనిచేస్తున్ రవితేజ మీద ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ తనను ప్రేమ పేరుతో మోసం చేశారని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించారంటూ 2023లో ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న తనను మోసం చేశాడని, ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి, ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే అంగీకరించడం లేదంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఏడాదిన్నర పాటు తనను ప్రేమిస్తున్నానని చెప్పి.. ఆయన ఉండే అపార్టుమెంటుకు కూడా తీసుకెళ్లాడని బాధితురాలు అప్పట్లో ఆరోపించింది.
పెళ్లి చేసుకోమంటే.. మొహం చాటేస్తున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించి ఎస్ఐ రవితేజను సస్పెండ్ చేశారు. అయితే యువతి ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని ఎస్ఐ రవితేజ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అసత్య ఆరోపణలు చేస్తోందంటూ స్పష్టం చేశారు. పోలీసులు మాత్రం ఎస్ఐ రవితేజ మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన గుంటూరు జిల్లా కోర్టు ఎస్ఐ రవితేజను దోషిగా తేల్చుతూ.. ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధించింది.