టిక్కెట్ల లొల్లి..
అనుకున్నదంతా అయ్యింది… అధికార పార్టీ కాంగ్రెస్ లో టిక్కెట్ల కోసం రగడ ప్రారంభం అయ్యింది. తమకు టిక్కెట్లు కేటాయించకపోవడంతో లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లను కాదని బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు కేటాయిస్తున్నారంటూ ఎమ్మెల్యే గడ్డం వినోద్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కోసం గొడవ ప్రారంభం అయ్యింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట నేతలు టిక్కెట్ల కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగో వార్డులో దాసరి కవితకు టిక్కెట్టు కోసం ఆమె మామ సీనియర్ కాంగ్రెస్ నేత తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయితే అక్కడ పంగ శాంత అనే మహిళకు టిక్కెట్టు కేటాయించారు. కవితకు టిక్కెట్టు దక్కకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. టికెట్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని వారు భీష్మించుకున్నారు. ఇంటలిజెన్స్ రిపోర్టు అంటూ చెబుతున్నారని అది సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తాము చస్తే కాంగ్రెస్లోనే చస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేను ఎవరు జోకితే వాళ్లకు టికెట్లు ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళకే ఎమ్మెల్యే గడ్డం వినోద్ టికెట్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. తమకు బీఫార్మ్ ఇచ్చే వరకు కదిలేది లేదంటున్న ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు.