గ్రామ పంచాయతీలకు శుభవార్త
15th Finance Commission funds:నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్న గ్రామపంచాయతీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం(15th Finance Commission) నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ చూపి.. కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపడంతో ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఈ నిధులు కొత్త ఊపిరి పోయనున్నాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడం, నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో పంచాయతీల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధుల విడుదలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎన్నికైన ప్రజాప్రతినిధులు(సర్పంచ్లు) ఉంటేనే ఈ నిధులను నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. ఇటీవల ఎన్నికలు ముగియడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. పంచాయతీలకు అందిన ఈ నిధులను ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా అవసరాల కోసం రాష్ట్ర సర్కార్ ఖర్చు చేయనుంది. రాష్ట్రానికి ఇంకా సుమారు రూ. 3,000 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉందని అంచనా. ఈ నిధుల విడుదలతో గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు మార్గం సుగమం కానుంది.