బస్సు ప్రమాదంపై మంత్రుల ఆరా
Ministers Ponnam, Jupally:ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఉట్నూరు మండలం షాంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ తరలించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రమాదం పై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్పూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లా అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలు, గాయపడిన ప్రయాణికులకు అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం ఉట్నూరు మండలం శ్యామ్ పూర్ లో అసిఫాబాద్ డిపోకు చెందిన TS20T 9369 ఆర్టీసీ బస్సు బ్రిడ్జి పై నుండి కింద పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాల పై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెల్లవారుజామున ఇరుకైన శ్యామ్ పూర్ బ్రిడ్జి పై ప్రొటెక్షన్ వాల్ లేకపోవడంతో ఘటన జరిగినట్లు ప్రాథమికంగా వెల్లడించారు. ఘటనపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ గాయపడిన క్షత్రగాతులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు.