అల్లం కాదు… విషం..
భాగ్యనగరంలో నకిలీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీలు ప్రజలకు అంటగడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి కల్తీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఖైరతాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అక్రమ తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నిల్వ ఉంచిన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడింది.
ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించి 21 ఏళ్ల జసాని ఇల్యాన్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ‘JJ ఫుడ్స్’ అనే బ్రాండ్ పేరుతో కల్తీ పేస్ట్ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాడు. కుళ్ళిన పదార్థాలు, హానికరమైన రంగులు కలిపి ఈ పేస్ట్ తయారుచేస్తున్నారు. తనిఖీల్లో మొత్తం 4 వేల కేజీల కల్తీ పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. రెండు గ్రైండింగ్ మెషీన్లు, 5 కేజీల పసుపు పొడి, 20 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 40 బస్తాల ఉప్పు సరఫరాకు వినియోగిస్తున్న గూడ్స్ ఆటోను సీజ్ చేశారు.
అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పేస్ట్ బహిరంగంగా టబ్బుల్లో ఉంచడం వల్ల దుమ్ము, ధూళి, ఈగలతో ఆ ప్రాంతమంతా దారుణంగా తయారయ్యింది. అంతేకాకుండా, యజమాని జసాని ఇల్యాన్ కాలం చెల్లిన లైసెన్స్ వినియోగిస్తున్నాడు. వేల కిలోల మేర తయారు చేస్తున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పటికే చాలా కిరాణాషాపులకు సరఫరా చేశాడు.