ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక పకడ్భందిగా నిర్వహించాలి
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్భందిగా చేపట్టాలని కలెక్టర్ కె. హరిత పేర్కొన్నారు. గురువారం అన్ని శాఖల అధికారులతో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ప్రత్యేక కార్యాచరణ పై కలెక్టర్ జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలపై ఈ నెల 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణపై వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించాలన్నారు.
ఈ 99 రోజుల కార్యక్రమాలు ప్రధానంగా 10 అంశాలపై కొనసాగుతాయన్నారు. మార్చి 6 నుండి 15 వరకు గ్రామాలలో మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యక్రమాలలో పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. పెండింగ్ ఫైళ్ళ పరిష్కార కార్యక్రమం చేపట్టాలన్నారు. మార్చి 8 న ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్ లు శాసన సభ్యులు, శాసన మండల సభ్యుల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలన్నారు.
ముఖ్యంగా గ్రామస్థాయి, నుండి జిల్లాస్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్, ఆరోగ్యం, రహదారి భద్రతలో భాగంగా అరైవ్ అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్ కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్యా, యువత, క్రీడలు, మహిళల సంక్షేమం, పర్యావరణంపై కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం.డెవిడ్ తదితరులు పాల్గొన్నారు.