అన్నదాత కోసం పోరుబాట
బీఆర్ఎస్, బీజేపీ ఆందోళనలు
రైతుల కోసం బీఆర్ఎస్, బీజేపీ పోరుబాట పట్టాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుల గురించి కనీసం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ ఆందోళనకు దిగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అటు, బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీలు సైతం గ్రామాల బాట పట్టాయి… అన్నదాతలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం రైతు భరోసా విధులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, మరోవైపు బీజేపీ శ్రేణులు సైతం ఫసల్బీమా పథకం అమలు చేయాలని… రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగనున్నాయి.
అన్నదాతలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం రైతు భరోసా విధులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ గ్రామాల బాట పట్టింది. ఈ రోజు (శనివారం) రైతుల సంతకాల సేకరణ చేపట్టనున్నారు. ఆదిలాబాద్ జిల్లా అంకోలి నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. రైతు భరోసా నిధుల విడుదలతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలపై సైతం రైతులను చైతన్యం చేసేలా కార్యక్రమం రూపకల్పన చేశారు. పెట్టుబడి సహాయం అందకపోవడంతో అధిక వడ్డీలకు డబ్బులు తెస్తూ నష్టపోతున్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించాయి. ఈ మేరకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న మాట్లాడుతూ రైతు భరోసా పేరుతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు. ఈనెల 7వ తేదీ నుండి రైతుల సంతకాల సేకరణ అంకోలి గ్రామం నుంచి చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈనెల 16నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్న డిమాండ్ తో సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు.
ఇక బీజేపీ సైతం ఫసల్బీమా పథకం అమలు చేయాలని… రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగనుంది. ఈ రోజు జైనథ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఆదిలాబాద్ నుంచి ఈ నిరసన ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రైతులకు న్యాయం చేసేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.