ఒలంపిక్స్ లక్ష్యంగా ముందుకు…
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణలో అన్ని సౌకర్యాలతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యమిచ్చేలా, ఒలంపిక్స్లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటడమే లక్ష్యంగా క్రీడా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. క్రీడలకు అవసరమైన మైదానాలు, యూనివర్సిటీ, శిక్షణ తదితర అంశాలపై క్రీడాశాఖకు సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
ఈ సందర్బంగా రాష్ట్రంలో తలపెట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (YISU) అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మైదానాలు, అన్ని సౌకర్యాలు కల్పించడంపై చర్చించారు. నిర్మాణాలకు సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. గచ్చిబౌలి ఔట్డోర్ స్టేడియం పునరుద్ధరించడంతో పాటు, స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్నగర్ స్టేడియంలను భవిష్యత్ అవసరాలు, క్రీడాకారులకు శిక్షణ, పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కిషోర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.