శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
Tirumala:మీరు తిరుమల వెళ్తున్నారా..? శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధన ఇప్పటికే అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది…
తిరుమలలో శ్రీవారి భక్తులకు సంబంధించి టీటీడీ కొత్త నిబంధన అమలు చేస్తోంది. గతంలో భక్తులకు దర్శనానికి సంబంధించి కొంత ముందుగా అయినా పంపేవారు. కానీ, ఇప్పటి నుంచి స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలోనే దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతిస్తారు. ఈ నిబంధన సోమవారం నుంచే టీటీడీ కఠినంగా అమలు చేస్తోంది. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని, అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని తెలిపింది.
ఇంతకుముందు దర్శనానికి టోకెన్లు ఉన్న భక్తులు సమయం కంటే ముందుగా వచ్చినా అనుతించేవారు. అయితే, అసలు సమయానికి వచ్చేవారు, ముందుగా వచ్చే వారు ఒకేసారి కావడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో భక్తులకు ఈ ఇబ్బందులు తప్పించేందుకు ఖచ్చితంగా అందులో ఉన్న సమయానికే రావాలని సూచిస్తోంది. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో టైమ్ నిబంధన ఖచ్చితంగా పాటించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ సోమవారం నుంచే దీనిని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టికెట్లపై పొందుపర్చిన దర్శన సమయం కంటే ముందుగానే క్యూలైన్ల వద్దకు వస్తే అనుమతించమని, వాటిపై ప్రింట్ అయిన టైమ్కు మాత్రమే భక్తులను ఇప్పటినుంచి దర్శనాలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది.