జాతీయ రాజకీయాలకు వెళతా…
సీఎం రేవంత్రెడ్డి
Revanth Reddy:2034లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాహుల్ తర్వాతి స్థానంలో ఉంటానని అన్నారు. అప్పటి వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ(Rahul Gandhi)ని ప్రధానిని చేయడమే తన లక్ష్యం అన్నారు. “ఇప్పటివరకు నా జీవితంలో నేను అనుకున్నదే జరిగింది. ZPTC అవుతా అనుకున్నా అయ్యాను. MLC, MLA అవ్వాలనుకున్నప్పుడు అదే జరిగింది. ఎంపీ అవ్వాలనుకున్నా 2014లో కుదర్లేదు. 2019లో అదే స్థానం నుంచి గెలిచా. తెలంగాణ వస్తే CM అవుతానని చెప్పా. చెప్పినట్లుగానే సీఎం అయ్యా. 2034 వరకు సీఎంగా ఉంటా. 2034లో తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా.” అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.